పిసీడబ్ల్యూ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి: సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలకు తనకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. సుస్మిత పటేల్ తన వ్యక్తిగత అభిప్రాయాన్ని మాత్రమే వెల్లడించారని, ఆ వ్యాఖ్యల్లో తన ప్రమేయం, సూచనలు, జోక్యం ఏమీ లేదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని సుస్మిత పటేల్ స్వయంగా వివరణ ఇచ్చిన నేపథ్యంలో తనకు జారీ చేసిన నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలని కొండా సురేఖ డిమాండ్ చేశారు. తన ప్రమేయం లేని అంశంలో తనను వివాదంలోకి లాగడం సరికాదన్నారు. ఎవరు చేసిన వ్యాఖ్యలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని, సంబంధం లేని వ్యక్తిపై బాధ్యతను మోపడం న్యాయసమ్మతం కాదని అన్నారు. వాస్తవాలు స్పష్టంగా ఉన్నప్పటికీ రాజకీయంగా తనపై ఆరోపణలు చేయడం, అనవసరంగా వివాదాన్ని పెద్దది చేయడం తగదని మండిపడ్డారు.“సుస్మిత పటేల్ మాట్లాడిన మాటలకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆమె తన అభిప్రాయాన్ని మాత్రమే వ్యక్తం చేశారు. ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదని ఆమె స్పష్టంగా వివరణ ఇచ్చారు. అయినా నాకు నోటీసులు జారీ చేయడం ఎందుకు?” అని కొండా సురేఖ ప్రశ్నించారు. సుస్మిత పటేల్ వివరణను పరిగణనలోకి తీసుకుని వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని, తనపై జారీ చేసిన నోటీసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అనవసర వివాదాలకు దారితీసే చర్యలను సహించేది లేదని స్పష్టం చేశారు.
