పిసిడబ్ల్యూ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి: నడికూడ: అధికారుల పట్ల గౌరవం పాటించాల్సిన బాధ్యత కలిగిన పంచాయతీ కార్యదర్శి తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నడికూడా మండలంలోని ఓ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎమ్మార్వోతోనే అనుచితంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలోనూ ఇదే తరహాలో వ్యవహరించినప్పటికీ, తన తీరు మార్చుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రతి అంశంలోనూ అతిగా జోక్యం చేసుకుంటూ, ఇతర అధికారుల విధుల్లోనూ తలదూరుస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాలను సైతం లెక్కచేయకుండా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు మరింత చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వహించే వ్యక్తి ఉన్నతాధికారులకు కనీస గౌరవం ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు సమగ్రంగా విచారణ జరిపి, నిజానిజాలు తేల్చి, బాధ్యతారహితంగా వ్యవహరిస్తే తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
