హనుమకొండ: పర్యావరణ సమతుల్యత, జీవ వైవిధ్య పరిరక్షణకు వన్యప్రాణుల సంరక్షణ అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా కాకతీయ జూ పార్కులో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. పులులు అడవుల సమతుల్యతను కాపాడే కీలక జాతి అని, అక్రమ వేట నియంత్రణతో దేశంలో వాటి సంఖ్య పెరుగుతోందన్నారు. అడవులు, వన్యప్రాణులను కాపాడడం ప్రతి పౌరుడి బాధ్యతగా భావించాలని, ముఖ్యంగా విద్యార్థులు ప్రకృతి పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వన్యప్రాణుల సంరక్షణ పోస్టర్లను ఆవిష్కరించి, వ్యాసరచన, చిత్రలేఖన పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు.
