పరకాల పట్టణంలో ఎక్కడా చెత్తకుప్పలు, మురికి కుప్పలు కనిపించకుండా ప్రత్యేక చర్యలు చేపట్టి ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి నూతన మున్సిపల్ కమిషనర్కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.గురువారం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ పరిశుభ్రతపై ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని, ప్రతి వార్డు పరిధిలో పారిశుధ్య పనులను క్రమం తప్పకుండా నిర్వహించాలని సూచించారు. ప్రధాన రహదారులు, కాలనీలు, మార్కెట్ ప్రాంతాలు, ప్రభుత్వ కార్యాలయాల పరిసరాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా చెత్త సేకరణను మరింత సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు మురుగు కాలువల శుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వర్షాకాలం నేపథ్యంలో దోమల వ్యాప్తి, అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. పరకాల పట్టణాన్ని ఆదర్శవంతమైన, పరిశుభ్రమైన పట్టణంగా తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి, పారిశుధ్య నిర్వహణలో రాజీ పడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
