పిసిడబ్ల్యూ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి: పరకాల పట్టణంలో నిర్వహించిన హిందూ ధర్మ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రేవూరి ప్రకాష్ రెడ్డి తన ప్రసంగంతో సభలో ఉన్న వారిని ఆకట్టుకున్నారు. హిందూ ధర్మం గొప్పతనాన్ని వివరిస్తూనే, భారతదేశం అనేది అనేక మతాల సమ్మేళనంగా నిలిచిందని ఆయన స్పష్టం చేశారు. తన ప్రసంగంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, హిందూ ధర్మం అనేది ప్రపంచానికి శాంతి, సహనం, సహజీవనం అనే విలువలను అందించిన మహోన్నతమైన సంస్కృతి అని చెప్పారు. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ధర్మం మనిషికి జీవన విధానాన్ని నేర్పుతుందని, కుటుంబ బంధాలను, సమాజ ఐక్యతను బలపరుస్తుందని పేర్కొన్నారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు మన సంస్కృతికి మూలస్థంభాలుగా నిలిచాయని తెలిపారు. అదే సమయంలో భారతదేశంలో హిందువులు మాత్రమే కాకుండా ముస్లింలు, క్రైస్తవులు, జైనులు, బౌద్ధులు వంటి అనేక మతాలకు చెందిన ప్రజలు సౌభ్రాతృత్వంతో కలిసి జీవిస్తున్నారని అన్నారు. ఈ వైవిధ్యంలో ఐక్యతే భారతదేశం ప్రత్యేకత అని, ప్రపంచానికి ఆదర్శంగా నిలిచేలా మన దేశం ముందుకు సాగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. హిందూ ధర్మం ఇతర మతాలను గౌరవించడం నేర్పుతుందని, ద్వేషం కాదు, ప్రేమ మరియు పరస్పర గౌరవమే మన బలమని ఆయన హైలెట్ చేశారు. ప్రతి ఒక్కరు తమ తమ మతాలను గౌరవిస్తూ దేశ సమైక్యతను కాపాడాల్సిన బాధ్యత మనందరిదని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా హిందూ ధర్మ సమ్మేళనం ద్వారా యువతలో సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు మన గొప్ప వారసత్వాన్ని అందించడం మన కర్తవ్యం అని చెప్పారు. ఈ హిందూ సమ్మేలానికి దాదాపుగా 4000 మంది హాజరై విజయవంతం చేశారు…
