వరంగల్: మార్చిలో ప్రారంభమయ్యే పదో తరగతి పబ్లిక్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా సిద్ధమవ్వాలని వరంగల్లో పనిచేస్తున్న సీనియర్ ఆంగ్ల ఉపాధ్యాయురాలు జ్యోతి శ్రీ సూచించారు. ఇంగ్లీష్ ప్రశ్నాపత్రం మొత్తం 80 మార్కులకు నిర్వహించబడుతుందని, సరైన టెక్నిక్స్ పాటిస్తే 10 GPA సాధించడం కష్టమేమీ కాదన్నారు. ప్రశ్నాపత్రం నాలుగు విభాగాలుగా ఉంటుందని వివరించారు. సెక్షన్–ఎ (Reading Comprehension) కు 20 మార్కులు ఉంటాయి. Seen/Unseen ప్యాసేజ్ను పూర్తిగా చదివి, ప్రశ్న అర్థం చేసుకుని సమాధానం రాస్తే పూర్తి మార్కులు సాధించవచ్చన్నారు. పదజాలంపై ప్రత్యేక దృష్టి అవసరమని తెలిపారు. సెక్షన్–బి (Vocabulary & Grammar) కు 20 మార్కులు ఉంటాయని, వ్యాకరణంపై పట్టు ఉంటే కనీసం 15 మార్కులు సులభంగా సాధించవచ్చని చెప్పారు. కాలాలు, మోడల్స్, ప్రీపొజిషన్స్ వంటి అంశాలను ప్రతిరోజూ అభ్యాసం చేయాలని సూచించారు. సెక్షన్–సి (Creative Writing) లో 20 మార్కులు ఉంటాయని, ఫార్మాట్ సరిగా రాయడం అత్యంత ముఖ్యమన్నారు. లెటర్, రిపోర్ట్, డైరీ ఎంట్రీ వంటి రచనల్లో మొదటి 2–3 మార్కులు ఫార్మాట్కే కేటాయిస్తారని గుర్తు చేశారు. సెక్షన్–డి (Textual Questions – Prose & Poetry) కు 20 మార్కులు ఉంటాయని, ప్రతి యూనిట్లో థీమ్, మోరల్, క్యారెక్టర్ స్కెచ్, పోయం అప్రిసియేషన్పై పూర్తి అవగాహన అవసరమన్నారు. ముఖ్యంగా Poetry Appreciationపై విస్తృతంగా ప్రాక్టీస్ చేయాలని సూచించారు.విద్యార్థులు రోజుకు కనీసం ఒక టాపిక్ చదవడం, పాత ప్రశ్నాపత్రాలను సాధన చేయడం, సమయపాలన పాటించడం, శుభ్రమైన హ్యాండ్రైటింగ్కు ప్రాధాన్యం ఇవ్వడం తప్పనిసరి అని పేర్కొన్నారు. “భయం వద్దు… ప్రతిరోజూ కొంచెం కొంచెంగా చదివితే పదో తరగతిలో మంచి ఫలితాలు ఖచ్చితంగా సాధించవచ్చు” అని జ్యోతి శ్రీ విద్యార్థులకు ధైర్యం చెప్పారు.
