పరకాల పట్టణ మునిసిపాలిటీ పరిధిలోని 17వ వార్డులో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శనిగరం రజని నవీన్ ఇంటింటి ప్రచారాన్ని ఉత్సాహంగా కొనసాగిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ప్రజల మధ్యకు వెళ్లి, ప్రతి ఇంటిని సందర్శిస్తూ వార్డు ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తాగునీటి సమస్య, డ్రైనేజీ, రోడ్లు, పారిశుధ్యం, వీధి దీపాలు, పింఛన్లు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై ప్రజలు తమ సమస్యలను అభ్యర్థికి వివరించారు. శనిగరం రజని నవీన్ మాట్లాడుతూ, గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పరకాల పట్టణానికి జరిగిన అభివృద్ధిని ప్రజలు మరువలేదని, మున్సిపాలిటీలో మళ్లీ బిఆర్ఎస్ జెండా ఎగరాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 17వ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని, ఎన్నికల్లో గెలిచిన వెంటనే పెండింగ్లో ఉన్న మౌలిక వసతుల సమస్యలను ప్రాధాన్యతగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉండే కౌన్సిలర్గా పనిచేస్తానని, ప్రతి సమస్యపై నిరంతరం పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. ఈ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో బిఆర్ఎస్ ముఖ్య నాయకులు, సీనియర్ కార్యకర్తలు, యువజన నాయకులు, మహిళా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని అభ్యర్థికి మద్దతుగా నిలిచారు. వార్డు ప్రజల నుంచి లభిస్తున్న స్పందన తమ విజయానికి నిదర్శనమని నాయకులు తెలిపారు. రాబోయే మునిసిపల్ ఎన్నికల్లో 17వ వార్డులో బిఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు.
