పరకాల పిసిడబ్ల్యూ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి: పరకాల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ పదవి కన్ఫర్మేషన్ నేపథ్యంలో పార్టీ ఆశావాహుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. స్థానికంగా పార్టీకి సేవలు అందించిన పలువురు నేతలను పక్కనబెట్టి తీసుకున్న ఈ నిర్ణయం పార్టీ అంతర్గత వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో పరకాల మండల ప్రెసిడెంట్ పదవి రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వడం, అలాగే టౌన్ ప్రెసిడెంట్ పదవి ఎస్సీ వర్గానికి కేటాయించడం పార్టీ సమతుల్యతకు నిదర్శనంగా భావించబడింది. అయితే తాజా నియామకంలో రెండు కీలక పదవులను ఒకే వర్గానికి కేటాయించడం వల్ల సామాజిక సమీకరణలు దెబ్బతిన్నాయని నేతలు విమర్శిస్తున్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన సీనియర్ నాయకులు, స్థానిక స్థాయిలో బలమైన నాయకత్వం ఉన్న వారిని పట్టించుకోకపోవడం తీవ్ర ఆగ్రహానికి దారి తీసింది. ఈ నిర్ణయం వల్ల పార్టీ కార్యకర్తల్లో నిస్పృహ నెలకొంది. “ఇది సమన్యాయం కాదని, పార్టీ బలోపేతానికి కాకుండా బలహీనతకు దారితీసే చర్య” అని పలువురు అభిప్రాయపడుతున్నారు. పార్టీ ఉన్నత నాయకత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించి, అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే భవిష్యత్తులో పార్టీకి తీవ్రమైన నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.– పరకాల కాంగ్రెస్ ఆశావాహులు / అసంతృప్తి వర్గం
