పరకాల పట్టణంలో ఈనెల 28వ తేదీ మంగళవారం సాయంత్రం 5:30 గంటలకు పశువుల సంత ప్రాంగణంలో నిర్వహించబడనున్న హిందూ ధర్మ సమ్మేళనాన్ని ఘనంగా విజయవంతం చేయాలని శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవాలయ మాజీ చైర్మన్ రాజేశ్వర్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు. హిందూ ధర్మ పరిరక్షణ, సాంప్రదాయాల పరిరక్షణ, సమాజంలో ఐక్యత బలపరచడం లక్ష్యంగా ఈ మహాసమ్మేళనం నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రాజేశ్వరరావు మాట్లాడుతూ, పరకాల పట్టణం మరియు పరిసర ప్రాంతాల నుంచి దాదాపు పదివేల మందికి పైగా భక్తులు, హిందూ సమాజానికి చెందిన ప్రజలు ఈ కార్యక్రమానికి తరలివచ్చి తమ ఐక్యతను చాటాలని కోరారు. హిందూ ధర్మం గొప్పతనాన్ని, విలువలను కొత్త తరం యువతకు తెలియజేయడం అత్యంత అవసరమని, అందుకు ఈ సమ్మేళనం వేదికగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి సద్గురు మహాదేవ్ స్వామి జీ ముఖ్య అతిథిగా హాజరై ధర్మ సందేశాన్ని అందించనుండగా, ప్రముఖ వక్త శ్రీ లింగం సుధాకర్ రెడ్డి ప్రధాన ప్రసంగం చేయనున్నారు. అదేవిధంగా నీలం నిర్మల ప్రత్యేక వక్తగా పాల్గొని హిందూ సంస్కృతి, ఆచారాల ప్రాముఖ్యతపై ప్రసంగించనున్నారు. సమ్మేళనం సజావుగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయని రాజేశ్వరరావు తెలిపారు. భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. సమ్మేళనం విజయవంతం కావడం ద్వారా పరకాల పట్టణం ధార్మిక చైతన్యానికి కేంద్రబిందువుగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో కలిసి భారీ సంఖ్యలో హాజరై ఈ హిందూ ధర్మ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని రాజేశ్వరరావు పునరుద్ఘాటించారు.
