పరకాల పట్టణ మునిసిపాలిటీలోని 22 వార్డులలో కీలకమైన 22వ వార్డులో కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఊపందుకుంది. 22వ వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ అభ్యర్థి అల్లే దశరథం మంగళవారం రోజున వార్డులో ఇంటింటి ప్రచారాన్ని జోరుగా నిర్వహించారు. కాంగ్రెస్ కండువా కప్పుకొని ప్రజలతో మమేకమై, వారి సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా “జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, రేవూరి ప్రకాష్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి” అంటూ నినాదాలు చేస్తూ కార్యకర్తలు ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రజలతో నేరుగా మాట్లాడిన అల్లే దశరథం, వార్డులో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలు, అభివృద్ధి అవసరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “నా మీద నమ్మకం ఉంచి నన్ను గెలిపిస్తే 22వ వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. పదవికోసం కాదు, సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఎన్నికల్లో బరిలోకి దిగాను. వార్డులో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుధ్యం వంటి సమస్యలను పరిష్కరించడమే నా లక్ష్యం” అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పరకాల పట్టణ అభివృద్ధికి కొత్త ఊపిరి వస్తుందని, ముఖ్యంగా 22వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ ఇంటింటి ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు.
