పరకాల పట్టణ మునిసిపాలిటీలో మొత్తం 22 వార్డులు ఉండగా, అన్ని 22 వార్డులలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు గెలుపొందేలా పార్టీ శ్రేణులు సమిష్టిగా పనిచేయాలని పరకాల యూత్ కాంగ్రెస్ మండల వైస్ ప్రెసిడెంట్, ఇనగాల యువసేన పట్టణ అధ్యక్షుడు బొచ్చు రాకేష్ పిలుపునిచ్చారు. ప్రజా పాలన అంటే ఏమిటో ప్రజలకు స్పష్టంగా అర్థమయ్యేలా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఆయన అన్నారు. ఇదే పాలన మరో ఐదు సంవత్సరాలు కొనసాగాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం అందించాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని పేర్కొన్నారు. పరకాల పట్టణంలో మునిసిపాలిటీ చైర్మన్ కుర్చీ ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కైవసం అవుతుందని బొచ్చు రాకేష్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, పరిష్కార దిశగా పని చేసే పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని, అందుకే ప్రజలు కాంగ్రెస్ వైపే చూస్తున్నారని ఆయన అన్నారు. పట్టణ అభివృద్ధి, పేదల సంక్షేమం, యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని స్పష్టం చేశారు. మునిసిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగిరేలా ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేయాలని, ఇంటింటి ప్రచారం ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు. నాయకులు, కార్యకర్తలు, యూత్, మహిళా విభాగాలు అందరూ ఐక్యంగా ముందుకు సాగితే విజయం కాంగ్రెస్ పార్టీదేనని బొచ్చు రాకేష్ అన్నారు. పరకాల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి చరిత్రాత్మక విజయం అందిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు
