పరకాల, జనవరి 30 ,(పీసిడబ్ల్యూ న్యూస్): పరకాల పట్టణ మునిసిపాలిటీలో మొత్తం 22 వార్డులు ఉండగా, ఈసారి గత ఎన్నికలతో పోలిస్తే కౌన్సిలర్ అభ్యర్థుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు వందమంది వరకు నామినేషన్లు దాఖలు చేసే పరిస్థితి నెలకొంది. నామినేషన్లకు ఈరోజే చివరి రోజు కావడంతో ఉదయం నుంచే అభ్యర్థులు, వారి అనుచరులు మునిసిపల్ కార్యాలయానికి భారీగా తరలివచ్చారు. ఎన్నికల క్రీడలో పాల్గొనే క్రీడాకారుల్లా ఉత్సాహంగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, పరకాల పట్టణ ఓటర్లు ఈసారి మరింత చైతన్యవంతులుగా మారినట్లు కనిపిస్తోంది. డబ్బులు, మద్యం వంటి ప్రలోభాలకు లొంగకుండా, నిజాయితీగా పనిచేసే, వార్డుల్లో మంచి పేరు కలిగిన అభ్యర్థికే ఓటు వేయాలని ఓటర్లు నిర్ణయించుకున్నట్లు చర్చ జరుగుతోంది. ప్రలోభాలకు పాల్పడే అభ్యర్థులకు ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నారు.
