పరకాల, జులై 02 పిసిడబ్ల్యూ న్యూస్: పరకాల పట్టణంలోని జయ డీలక్స్ రోడ్డులో కొందరు వ్యాపారులు తమ షాపుల ముందు బైకులు పార్క్ చేయడం, అలాగే వ్యాపారానికి సంబంధించిన పైపులు, ఇతర వస్తువులను రోడ్డుపై ఉంచడం వల్ల ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలుగుతోందని గుర్తించిన పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పరకాల సీఐ క్రాంతి కుమార్, ఎస్సై పవన్ పోలీసు సిబ్బందితో కలిసి జయ డీలక్స్ రోడ్డులో వ్యాపారులను ముందస్తుగా హెచ్చరించారు. షాపుల ముందు రోడ్డును ఆక్రమించి బైకులు పార్క్ చేయడం, వ్యాపార వస్తువులను రోడ్డుపై ఉంచడం వెంటనే నిలిపివేయాలని సూచించారు. ఇకపై ఎవరైనా రోడ్లపై బైకులు లేదా వ్యాపారానికి సంబంధించిన వస్తువులు ఉంచి ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తే సహించేది లేదని, నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ప్రజల సౌకర్యార్థం, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు.
