మొగుళ్లపల్లి, ఆగస్టు 7 పిసిడబ్ల్యూ న్యూస్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం రంగాపురం బస్టాండ్లో కనీస సౌకర్యాలు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండ్లో మూత్రశాలలు లేక మహిళలు, వృద్ధులు, చిన్నారులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. రోజూ రంగాపురానికి పరిసర ప్రాంతాల 10 నుంచి 20 గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నప్పటికీ, ప్రయాణికుల అవసరాలకు తగిన వసతులు కల్పించకపోవడం విమర్శలకు తావిస్తోంది. అదే విధంగా బస్టాండ్ ఆవరణలో సీసీ కెమెరాలు లేకపోవడంతో భద్రతపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రద్దీ సమయాల్లో జరిగే చోరీలు, ఇతర అవాంఛనీయ ఘటనలను అరికట్టేందుకు సీసీ కెమెరాల ఏర్పాటు అత్యవసరమని స్థానికులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బస్టాండ్లో ఆధునిక మూత్రశాలలు నిర్మించడంతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రయాణికులకు కనీస సౌకర్యాలు, భద్రత కల్పించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
